హైదరాబాద్ కాలేజీలు పూర్తయిన విద్యార్థులు ఉద్యోగం లేదా కోర్సుల కోసం నగరానికి వలస వస్తున్నారు. ఈ విద్యార్థులు హాస్టళ్లలో నివసించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. బడ్జెట్ హాస్టళ్లలో సౌకర్యాల కోసం ఎక్కువ కాంప్రొమైజ్ చేయాల్సి వస్తోంది. అయితే, ప్రీమియం హాస్టళ్లలో సైతం భోజన సౌకర్యాల విషయంలో అనారోగ్యకర పరిస్థితులు బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని ప్రైవేట్ హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో ఎక్స్పైరీ అయిన మసాలాలు, బూజుపట్టిన కూరగాయలు, అపరిశుభ్ర వాతావరణం, గుట్కా మరకలు, పురుగులు కనిపించడం కలకలం రేపింది. మాదాపూర్ అయ్యప్ప సోసైటీలోని పలు హాస్టళ్లలో ఫుడ్ లైసెన్స్ లేకుండా ఆహార పదార్థాలు నిల్వ చేయడాన్ని అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో హాస్టళ్లపై తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.