ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీ విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై సీబీఐ కోర్టులో 20 కేసులున్నాయని, కొన్నేళ్లుగా ఈ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయని, త్వరగా విచారణ పూర్తి చేయాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య గత ఏడాది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో ఎలాంటి పురోగతి లేదని, వీలైనంత త్వరలో విచారణ పూర్తి చేయాలని పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు గతేడాది జారీ చేసిన ఆదేశాల మేరకు హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆయా కోర్టులు ఆదేశించాయి. ఈ విచారణకు సంబంధించిన నివేదికను సమర్పించాలని హైకోర్టు మూడు వారాలపాటు వాయిదా వేసింది.

