తాను 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనుగోలు చేయలేదని రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి తెలిపారు. స్నేహితులు, బంధువులు బహుమతిగా ఇచ్చిన చీరలనే ధరిస్తున్నానని, కాశీలో ఇష్టమైన షాపింగ్ను వదులుకోవడం వల్ల చీరలు కొనలేదని చెప్పారు. తన తల్లి, అమ్మమ్మ సాధారణ జీవితం గడిపారని, వారి నుంచి నిరాడంబర జీవనశైలి వారసత్వంగా పొందినట్లు తెలిపారు. ‘‘ఆరేళ్ల క్రితం నా తల్లి చనిపోయినప్పుడు, ఆమె వద్ద 8 – 10 చీరలే ఉండేవి. 36 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ చనిపోయినప్పుడు, ఆమె వద్ద నాలుగు చీరలు మాత్రమే ఉండేవి. వారు నిరాడంబర జీవితం గడిపారు. ఆ విలువలతోనే నన్ను పెంచారు. వస్తు వ్యామోహం లేని నిరాడంబర జీవితాన్ని గడిపేందుకు నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు’’ అని సుధా మూర్తి పేర్కొన్నారు.