Wednesday, October 16, 2024
Homeతెలుగుతెలంగాణహరీష్ రావ్ పై నటుడు బండ్ల గణేష్ ఫైర్

హరీష్ రావ్ పై నటుడు బండ్ల గణేష్ ఫైర్

 

BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్

హైదరాబాద్, (వర్డ్ ఆఫ్ ఇండియా):

తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం నెలరోజుల పాలనపై సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్లగణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం గాందీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిపాలన ఎంతో అద్భుతంగా ఉందని, ప్రజలందరూ మెచ్చుకుంటున్నారని కొనియాడారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత, హరీష్ రావు ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తెలంగాణాకందిస్తున్న చక్కటి పరిపాలనను, ప్రజలు ఆదరిస్తున్న తీరుని చూసి హరీశ్ రావు ఓర్వలేక అసూయతో అలా మాట్లాడుతున్నారని ఒక రోజు హరీష్ రావు, మరో రోజు కేటీఆర్, ఇంకో రోజు కవిత ఇలా గ్యాప్ ఇచ్చి ఒకరితరువాత ఒకరు ఈర్షతో మాట్లాడతున్నారని విమర్శించారు.

వంద రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పప్పులుడకవని హరీష్ రావు వ్యాఖ్యలపై అదే వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో చికెన్, బిర్యానీ అన్నీ ఉడుకుతాయని బండ్ల గణేష్ అన్నారు. వంద రోజుల తర్వాత కాంగ్రెస్‌ను హరీష్ రావు ఏమీ చేయలేరని దుయ్యబట్టారు. బీఆరెస్ నియంతృత్వ పాలనకు పాతరేసి, ప్రజాపాలన తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా రూ. 10 లక్షలు చేశామన్నారు. ప్రజా పాలన పేరుతో గ్రామ స్థాయి నుండి పట్టణాల వరకు అందరికి సంక్షేమం అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆలోచనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కేవలం నెల రోజుల్లో ఇంత గొప్పగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తుంటే.. హరీష్ రావు ఎందుకింత ఈర్ష్య పడుతున్నారని బండ్ల గణేష్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ మంత్రులు దర్యాప్తు చేస్తున్నారని, డెమొక్రసీ అంటే ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌లా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి రోజు ప్రజలకు, నాయకులకు అందుబాటులో ఉంటున్నారని అన్నారు. గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారో చెప్పాలని బండ్ల గణేష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులే అయిందని అర్ధం చేసుకోకుండా హరీష్ రావు, కేటీఆర్ ప్రతి రోజు ప్రెస్ మీట్‌లు పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. అధికారుల నియామకాల్లో కుల, రాగద్వేషాలకు అతీతంగా సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారులను నియమించిన ఘనత రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు.

అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన జరుగుతోంది కాబట్టే ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి, మంత్రులు ప్రజాపధం వైపుకు దూసుకుపోతున్నారని బండ్ల గణేష్ అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్‌కు ఈర్ష్య తారా స్థాయికి చేరుకుందన్నారు. అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలు మీరు ఏం చేశారు? తెలంగాణకు రావలసిన హామీలపై ఏమైనా కేంద్రంతో కొట్లాడారా? అని ప్రశ్నించారు. మీలా కాకుండా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ తెలంగాణకి రావలసిన నిధుల కోసం పోరాటం చేస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉందని, నీతివంతమైన పాలన అందిస్తున్నారని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS