సీఎం హేమంత్ సోరెన్ మిస్సింగ్.. అసలేం జరిగిందంటే!
– By CORRESPONDENT
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఆయనను విచారించేందుకు జనవరి 29న ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. ఆ సమయంలో హేమంత్ సోరెన్ నివాసంలో లేరని తెలిసి కంగుతిన్నారు. అనంతరం దాదాపు 13 గంటలు అక్కడే మకాం వేసి సీఎం ఇంట్లో సోదాలు చేశారు. ఈ దాడుల్లో ఓ బీఎండబ్యూ కారు, రూ.36లక్షలు, కొన్ని పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా అరెస్టుకు భయపడి సీఎం పరారయ్యరనే వార్తలతో ఝార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
అజ్ఞాతం నుంచి వచ్చిరాగానే ఎమ్మెల్యేలతో భేటీ
దాదాపు 30 గంటల తర్వాత ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అజ్ఞాతం వీడారు. ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రాంచీలో ప్రత్యక్షమయ్యారు. తన అధికార నివాసంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా-(జేఎంఎం) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆయన భార్య కల్పన కూడా హాజరయ్యారు. దీంతో సతీమణికి రాష్ట్ర పగ్గాలు అప్పగించే వీలుందంటూ వస్తోన్న ఊహాగానాలకు మరింత ఊపిరిపోసినట్లైంది.
#WATCH | Jharkhand CM Hemant Soren holds a meeting of the state's ministers and ruling side's MLAs at CM's residence in Ranchi.
His wife Kalpana Soren is also present at the meeting. pic.twitter.com/oo2GJhZ0gi
— ANI (@ANI) January 30, 2024
అటు సీఎం మిస్సింగ్ వార్తలు దావనంలా వ్యాపించడంతో బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. సోరెన్ ఫోటోతో ఓ మిస్సింగ్ పోస్టర్ను ట్వీట్ చేసి రూ.11 వేల రివార్డు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఈనెల 31వ తేదీ బుధవారంనాడు మధ్యాహ్నం 1.గంటలకు రాంచీలోని నివాసంలో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సీఎం హేమంత్ సోరెన్ను ఆదేశించారు. ఈ క్రమంలో ఆయన ఇంటితో పాటు రాజ్ భవన్, ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదు: గవర్నర్ రాధాకృష్ణన్
ఝార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులపై గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. తాను కూడా అందరిలాగానే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయ విభేదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చట్టానికి ఎవరు అతీతులు కాదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా రాజ్యంగ పరిధిలో పని చేస్తామని గవర్నర్ స్పష్టం చేశారు.
READ ALSO: సీఎం మమతా బెనర్జీకి రోడ్డు ప్రమాదం