ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది.. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మాత్రం ఈ ఫలితాలు నిరాశ మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసిన అన్నదమ్ములు, భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు పోటీ చేయగా.. కొందరు ఓడిపోగా.. మరికొందరు విజయం సాధించారు. వైఎస్సార్సీపీ నుంచి బరిలోకి దిగిన అన్నదమ్ములు.. ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం నియోజకవర్గం), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట నియోజకవర్గం) నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అలాగే అంబటి రాంబాబు (సత్తెనపల్లి నియోజకవర్గం), అంబటి మురళి (పొన్నూరు నియోజకవర్గం) నుంచి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి ఓడారు.
వై వెంకట్రామిరెడ్డి (గుంతకల్లు నియోజకవర్గం), వై సాయిప్రసాద్ రెడ్డి (ఆదోని నియోజకవర్గం) వైఎస్సార్సీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే వీరి మరో సోదరుడు మంత్రాలయం నియోజకవర్గం నుంచి వై బాలినాగిరెడ్డి మాత్రం గెలిచారు. మరోవైపు కూటమి అభ్యర్థిగా బీజేపీ టికెట్పై రాజంపేటం ఎంపీగా పోటీ చేసిన నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓడిపోగా.. ఆయన సోదరుడు నల్లారి కిశోర్కుమార్రెడ్డి (పీలేరు) నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి గెలవగా.. ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి తంబళ్లపల్లె నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజంపేట ఎంపీగా రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్రెడ్డి గెలిచారు. మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం.. ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ విశాఖపట్నం నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి కడప జిల్లా పులివెందులలో గెలవగా.. ఆయన చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా విజయాన్ని అందుకున్నారు. మరోవైపు కుప్పంలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరిలో ఆయన తనయుడు నారా లోకేశ్ విజయాన్ని అందుకున్నారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోయారు. టెక్కలిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు.. శ్రీకాకుళం ఎంపీగా కింజరపు రామ్మోహన్నాయుడు గెలిచారు.
జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి గెలవగా.. కడప ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూపేశ్రెడ్డి ఓడిపోయారు. హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గెలవగా.. ఆయన అల్లుడు నారా లోకేష్ మంగళగిరిలో.. విశాఖ ఎంపీగా భరత్ గెలుపొందారు. ఆమదాలవలసలో తమ్మినేని సీతారాంపై టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ గెలిచారు.. వీళ్లిద్దరు మామ, మేనళ్లులు అవుతారు. కమలాపురంలో వైఎస్ జగన్ మేనమామ, వైఎస్సార్సీపీ అభ్యర్థి రవీంద్రనాథ్రెడ్డి ఓడిపోయారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ గెలుపొందారు.. వీళ్లిద్దరు బావ, బామ్మర్దులు. రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి వాసు.. శ్రీకాకుళం ఎంపీగా కింజరపు రామ్మోహన్నాయుడు విజయం సాధించారు.. వీళ్లు కూడా బావ, బామ్మర్దులు.. ధర్మవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జమ్మలమడుగులో సుధీర్రెడ్డి ఓడిపోయారు.. వీరు కూడా బావ, బామ్మర్దుల బంధుత్వం ఉంది. అంతేకాదు రాజమహేంద్రవరం ఎంపీగా గెలిచిన పురందేశ్వరి కూడా నారా, నందమూరి కుటుంబాలకు బంధుత్వం ఉన్నసంగతి తెలిసిందే.