ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ ఎంపీ, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు(MP Keshava Rao) ఈరోజు భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్లో చేరబోతున్నట్టు నిన్న ప్రకటించిన కేకే ఇవాళ సీఎం నివాసానికి వెళ్లారు.
సీఎం రేవంత్ రెడ్డితోపాటు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో దాదాపు 40నిమిషాలపాటు భేటీ అయ్యారు. తాను సోనియాగాంధీ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్టు వారికి చెప్పినట్టు తెలుస్తోంది.
తనతోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు కూడా పార్టీలో చేరతారని సీఎం రేవంత్ రెడ్డితో కేకే చెప్పినట్టు తెలుస్తోంది. కేకే కుమార్తె, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ఇదివరకే ప్రకటించారు.
తాను నగర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కే.కేశవరావు తెలిపారు. అయితే రేపు ఢిల్లీలో సోనియా సమక్షంలో కేకే(MP Keshava Rao) కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.
వచ్చే నెల 6 లేదా 7వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగ సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది.
READ LATEST TELUGU NEWS: పవన్ పిఠాపురంలో గెలిస్తే ఏం జరగబోతుంది?