భారత రైల్వే ప్రయాణికులకు రద్దీ అనేది అతి పెద్ద సమస్య. కొన్ని రైళ్లలో నిలబడడానికి కూడా చోటు ఉండదు. ముఖ్యంగా రిజర్వ్ కంపార్ట్మెంట్స్లో జనరల్ టికెట్ ఉన్నవారు ఎక్కడం, టికెట్ లేని వారు ఎక్కడం, జనరల్ కోచ్ల సంఖ్య తగ్గించడం, కొన్ని ప్రాంతాలకు రైళ్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రద్దీకి ప్రధాన కారణమవుతున్నాయి.. మెట్రో ట్రైన్స్, లోకల్ ట్రైన్స్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇరుక్కుని మరి గందరగోళ వాతావరణంలో జర్నీలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో, కేంద్రం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వందే భారత్ రైలులో కూడా ఇదే సమస్య ఎదురైంది. లక్నో జంక్షన్, డెహ్రాడూన్ మధ్య నడిచే వందే భారత్ రైలులో ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయింది. నిలబడే స్పేస్ లేకుండా కిక్కిరిసిపోయింది. కేవలం ఉన్న సీట్ల వరకే ప్రయాణికులతో ఉండాల్సిన వందే భారత్ రైలు, ప్రయాణికులతో కిటకిటలాడింది. వీరు ట్రైన్ టికెట్ లేకుండా వందే భారత్ రైలులో ప్రయాణం చేస్తున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వందే భారత్ రైలు కూడా సాధారణ రైలు మాదిరే రద్దీతో నిండిపోవడం నెటిజన్లలో చర్చకు దారి తీసింది. .ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైళ్ల సంఖ్యను పెంచాలని కేంద్ర రైల్వే మంత్రిని నెటిజన్లు కోరుతున్నారు.

