ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తోంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు నడిచి వెళ్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
బుధవారం సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.
నిస్సహాయులకు సహాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తండాలు, గూడాలలో ఉన్న అత్యంత నిరుపేదలకు పథకాలు అందించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సచివాలయానికి, ప్రజాభవన్కు వచ్చి దరఖాస్తులు ఇవ్వడం కష్టమైన పని అన్నారు.
హైదరాబాద్ రావాల్సిన పని లేకుండా గ్రామాల్లోనే లబ్దిదారుల ఎంపిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతోందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పంపుతున్నట్టు చెప్పారు.
గ్రామ సభల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటీసీలు, మంత్రలు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమానికి రప్పించడం కాకుండా ప్రజల వద్దకే వెళ్లి గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.