తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishor ) చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా జరిగిన ఎక్స్ప్రెస్ హైదరాబాద్ డైలాగ్స్ అనే కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్లు నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. త్వరలో ఏపీలో జరగబోతున్న ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి (CM YS Jagan) భారీ ఓటమి ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. అటు టీడీపీ-జనసేన కూటమి విజయకేతనం ఎగరేస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అయితే గత ఎలక్షన్లలో వైసీపీ తరఫున వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.. సీఎం జగన్ ఓటమిపై కామెంట్లు చేయడం హాట్ టాపిక్గా మారింది. చదువుకున్న ఏపీ యువత ఉద్యోగాలు కోరుకుంటుందని ఉపాధి కాదని పీకే అన్నారు. కానీ.. సీఎం వైయస్. జగన్ మాత్రం ఉద్యోగ కల్పన పక్కనబెట్టి.. ఉచితాలపైనే శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోనుందని తెలిపారు.
Jagan is Losing Big. జగన్ దారుణంగా ఓడిపోబోతున్నాడు – Prashant Kishore#JaganisLosing #HelloAP_ByeByeYCP pic.twitter.com/aUkHZw262Q
— JanaSena Party (@JanaSenaParty) March 3, 2024
ఇక తెలంగాణ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ (PK) చేసిన కామెంట్లు దుమారం లేపుతున్నాయి. తానే బీఆర్ఎస్ (BRS) కార్యకర్తనై ఉంటే.. ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితిని చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడినని అన్నారు. ఒకవేళ తెలంగాణలో బీజేపీ హవా పెరిగితే.. బీఆర్ఎస్ గల్లంతయ్యే ప్రమాదముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ఉనికి ప్రశార్థకమేనని డేంజర్ బెల్స్ మోగించారు.
త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశమయ్యాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణలో కనుమరుగు అవుతుందనడంతో గులాబీ శ్రేణుల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే బీజేపీ (BJP) నేతలు పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ప్రశాంత్ కిషోర్ మాటలు సైతం వాటికి బలం చేకూర్చుతుండటంతో గులాబీ తమ్ముళ్ల గుండెలు అదురుతున్నాయి.
అటు ఏపీలోనూ వై నాట్ 175 అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది వైసీపీ. అలాంటి అధికార పార్టీకి భారీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పి.. ఫ్యాన్ రెక్కలు విరిచినంత పనిచేశాడు ప్రశాంత్ కిషోర్. కాగా.. ఆయన మాటలను వైసీపీ నేతలు తీసిపారేస్తున్నారు. ఆయనో మాయల ఫకీరంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇదే నిజం.. జరిగితీరుతుందంటూ సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో పీకే వ్యాఖ్యలు మంట రాజేస్తున్నాయి.
READ LATEST TELUGU NEWS : వైసీపీ ఒంగోలు ఎంపీ రాజీనామా.. రంగంలోకి దిగిన కుమారుడు?